న్యూఢిల్లీ, జనవరి 8: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో నేను ఎప్పుడు మాట్లాడలేదని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ప్రధాని మోదీ సైతం తనతో మాట్లాడలేదని, ఆయన కేవలం హలో అని మాత్రమే అంటారని చెప్పుకొచ్చారు. తన గురించి మోదీ చేసే వ్యాఖ్యలన్నీ తనపై ఆయనకున్న ద్వేషం, కోపం నుంచి పుట్టుకొస్తాయని రాహుల్ వ్యాఖ్యానించారు. తాను రాజకీయ కుటుంబం నుంచి వచ్చాననే సత్యాన్ని అంగీకరిస్తానని అన్నారు.
తన కుటుంబంలో జరిగిన విషాద సంఘటనలను మోదీ గుర్తించలేరని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబంపై తండ్రి రాజీవ్ గాంధీ, నాయనమ్మ ఇందిరా గాంధీల హింసాత్మక మరణాల ప్రభావాన్ని మోదీ చూడలేరని దుయ్యబట్టారు. ఆ బాధ నుంచి తాను బయటపడిన తీరును, నేర్చుకున్న పాఠాలను మోదీ గుర్తించకపోవడం విచారకరమన్నారు. ఈ నెల 11 నుంచి గల్ఫ్ పర్యటనకు వెళుతున్న నేపథ్యంలో గల్ఫ్ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.