అహ్మదాబాద్, జనవరి 7: రిజర్వేషన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. అగ్రవర్ణాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లను కేటాయించాలని నిర్ణయించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. కేబినేట్ నిర్ణయాన్ని పాటిదార్ ఉద్యమ నేత హార్ధిక్ పటేల్ తప్పుబట్టారు. ఓ జాతీయ చానెల్తో మాట్లాడుతూ.. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాని మోదీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని, అందుకే తనలోని చివర అస్త్రాన్ని ఈ రకంగా వదిలారన్నారు.
ఇలాంటి రిజర్వేషన్ లాలీపాప్ ప్రజలకు అందిస్తే అది పెద్ద పొరపాటు అవుతుందని, సరిగ్గా అమలు చేయకపోయినా ప్రజలు తిరగబడతారని వ్యాఖ్యానించారు. మోదీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.