ఢిల్లీ, జనవరి 7: భారతదేశ మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్' చిత్రానికి ఢిల్లీ హైకోర్టులో ఉపశమనం లభించింది. ఈ చిత్ర ట్రైలర్ను నిషేధించాలంటూ వేసిన పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. ఢిల్లీకి చెందిన పూజా మహాజన్ అనే ఫ్యాషన్ డిజైనర్ ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్' ట్రైలర్ను నిషేధించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిత్రబృందం సెక్షన్ 416ను ఉల్లంఘించిందని పూజ పిటిషన్లో పేర్కొంది.
సినిమా యూనిట్ సెక్షన్ 416ను అతిక్రమించిందని, వొక వ్యక్తి జీవితాధారంగా సినిమా తీస్తున్నప్పుడు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకురావాలని పిటిషన్లో పేర్కొంది. ఈ కేసు విషయమై పూజ తరఫు న్యాయవాది మైత్రి మాట్లాడుతూ..‘నిర్మాతలు మన్మోహన్ సింగ్ నుంచి కానీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నుంచి కానీ ఎలాంటి అనుమతి తీసుకోలేదు. కాబట్టి ట్రైలర్ను, సినిమాను నిషేధించండి అన్నారు. వాదోపవాదాలు విన్న న్యాయమూర్తి విభు భాక్రు సదరు పిటిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమాకు, ఫ్యాషన్ డిజైనర్కు ఎలాంటి సంబంధంలేదని, అసలు పిటిషన్ వేయడానికి సినిమాతో ఆమెకున్న సంబంధం ఏంటని ప్రశ్నించారు.
మన్మోహన్ సింగ్కు యూపీఏ - 1 హయాంలో మీడియా సలహాదారుగా వ్యవహరించిన సంజయ్ బారు రాసిన వివాదాస్పద పుస్తకం.. ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ : ది మేకింగ్ అండ్ అన్మేకింగ్ ఆఫ్ మన్మోహన్సింగ్ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. జనవరి 11న ఈ సినిమా విడుదల కానుంది.