అమరావతి, జనవరి 6: సినీ నటుడు శివాజీ పై హాస్య నటుడు, వైసీపీ నేత పృథ్వి తీవ్ర విమర్శలు చేశారు. తెలుగుదేశం వేదికలపై ఉండే నటుడు శివాజీ తన వెనుక ఎవరూ లేరని చెప్పడం హాస్యాస్పదమని ఆయన వెనుక టీడీపీ ఉందని అన్నారు. అయితే తాను టీడీపీ నేతను అని ప్రకటించుకోవడానికి శివాజీ సిగ్గు పడుతున్నారేమోనని ఆయన అన్నారు. ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన శివాజీపై పృథ్వీ వ్యాఖ్యలు చేశారు. జగన్పై దాడి జరిగినప్పుడు ప్రభుత్వ పెద్దలు అవహేళన చేశారని విమర్శించారు. వొక జంతువుకు దెబ్బ తగిలితేనే నాలుగు జంతువులు చుట్టూ చేరుతాయనీ, ఆపాటి ఇంగిత జ్ఞానం కూడా కొందరికి లేదని అన్నారు. జగన్పై దాడి జరిగిన తర్వాత అమెరికాకు వెళ్లిపోయిన శివాజీ ఇప్పుడు తిరిగొచ్చి నన్నేం చేస్తారంటూ మీసాలు మెలేస్తున్నారని, సమయం వచ్చినప్పుడు ఏం చేస్తారో తెలుస్తుందని అన్నారు.