హైదరాబాద్, జనవరి 5: దేశ రాజధానిలో జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు వరుసగా నాలుగో సారి కూడా తెలంగాణ తన ఘనతను చాటుకోలేకపోయంది. తెలంగాణ అధికారులు తయారు చేసిన శకటం ఈ సారి కూడా ఢిల్లీలో అధికారులను మెప్పించలేకపోయింది. గణతంత్ర దినోత్సం, స్వాతంత్య్ర దినోత్సవం రోజున దేశ రాజధాని దిల్లిలో జాతీయ జెండా వందనం నిర్వహిస్తారు. ఆ సమయంలో దేశంలోని అన్ని రాష్ట్రాలకు సంబంధించిన శకటలను అక్కడ ఊరేగిస్తారు. ఆ రాష్ట్ర ప్రత్యేకతను తెలియజేసేలా శకటాలను ఏర్పాటు చేస్తారు. కాగా ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తున్న మాదిరిగా కాకుండా శకటాలను కొంచెం ప్రత్యేకంగా తయారు చేయాలని సంబంధిత కమిటీ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.
2015వ సంవంత్సరంలో బోనాల థీమ్ తో గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ శకటం 2016,2017, 2018లో అవకాశం దక్కించుకోలేదు. 2016, 2017లో బతకమ్మ థీమ్ ని పంపగా అది అధికారులను మెప్పించడంలో విఫలమైంది. కాగా 2018లో మేడారం జాతర థీమ్ ని పంపించారు. కాగా అది కూడా అధికారులను మెప్పించలేక పోయింది. ఈ ఏడాది మహాత్మా గాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని ఆ థీమ్ మీద శకటం తయారు చేయాల్సిందిగా కేంద్రంలోని అధికారులు రాష్ట్రాలకు సూచించారు. మహాత్మాగాంధీ మీద తెలంగాణ అధికారులు తయారు చేసిన శకటం అక్కడి అధికారులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో మరోసారి తెలంగాణ అవకాశం దక్కలేదు.