తిరువనంతపురం, జనవరి 5: శబరిమలలోని అయ్యప్ప ఆలయంలోకి ఇద్దరు మహిళల ప్రవేశం కేరళ రాష్ట్రాన్ని రణరంగంగా మార్చింది. రాష్ట్రం అంతటా ఆందోళనకు దిగిన హిందూ సంస్థలు రోడ్లకు అడ్డంగా కాలిపోతున్న టైర్లను ఉంచి నిరసనకు దిగారు. దీంతో జనజీవనానికి, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఆందోళనకారుల దాడిలో పలువురు పాత్రికేయులు గాయాలపాలయ్యారు. కాగా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఇప్పటివరకు 8 మంది మహిళలు శబరిమల అయ్యప్పను దర్శించుకున్నారని కేరళ పోలీసులు వెల్లడించారు. కానీ 42 ఏళ్ల బిందు అమ్మిని, 41 ఏళ్ల కనకదుర్గ మాత్రమే శబరిమల ఆలయంలోకి ప్రవేశించిన విషయం అందరికి తెలిసింది. ఈ వ్యవహారంపై కేరళలో ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి.
శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్లలోపు వయసున్న మహిళలు ప్రవేశించరాదని ఉన్న నిషేధాన్ని సుప్రీంకోర్టు 2018, సెప్టెంబర్లో కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఎనిమిది మంది మహిళలు అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించారన్న పోలీసుల వాదనను శబరిమల కర్మ సమితి తోసిపుచ్చింది. ఎక్కువ మంది మహిళలు శబరిమలకు తరలిరావాలన్న కుట్రలో భాగంగా ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించింది.