న్యూఢిల్లీ, జనవరి 4: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే రఫేల్ వొప్పందంపై విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షిస్తుందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఈరోజు పార్లమెంట్ లో రఫేల్పై చర్చ జరుగుతున్న క్రమంలో, పార్లమెంట్ వెలుపల రాహుల్ మీడియాతో మాట్లాడుతూ రఫేల్పై చర్చ అంటే ప్రధాని నరేంద్ర మోదీ పారిపోతున్నారని మండిపడ్డారు. ఈ వొప్పందంపై రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్కు ఆయన పలు ప్రశ్నలు సంధించారు.
రఫేల్ వొప్పందంపై రాహుల్ గాంధీ సభను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఆరోపించారు. రఫేల్పై విచారణ అవసరం లేదని సుప్రీం కోర్టు ఎక్కడా చెప్పలేదని, దీనిపై విచారణకు ఆదేశించే పరిధి న్యాయస్ధానానికి లేదని మాత్రమే సర్వోన్నత న్యాయస్ధానం పేర్కొందని రాహుల్ అన్నారు. ఈ వొప్పందానికి సంబంధించి పలు అంశాలను లేవనెత్తారు. అనిల్ అంబానీ సంస్థకు రఫేల్ వొప్పందంలో భాగస్వామ్యం కల్పించింది ఎవరని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. రఫేల్పై తాము లేవనెత్తిన అంశాలన్నింటికీ రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ బదులివ్వాలని రాహుల్ డిమాండ్ చేశారు.