పాట్నా, జూలై 28 : ముఖ్యమంత్రి పదవి నుంచి రాజీనామా చేసిన నీతిష్ కుమార్ 24 గంటల లోపలే మళ్లీ బీహార్ ముఖ్యమంత్రిగా గురువారం రాజ్ భవన్ లో గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి చేతుల మీదుగా ప్రమాణస్వీకారం చేసిన ఘనత దక్కించుకున్నారు. బీహార్ ప్రగతిని దృష్టిలో పెట్టుకునే కూటమినుంచి విడిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రమాణ స్వీకారం అనంతరం నితీష్ వెల్లడించారు. కాగా, నేడు ఉదయం 11 గంటలకు బిహార్ అసెంబ్లీలో నితీశ్ బలనిరూపణ చేసుకోనున్నారు. దీంతో రెండేళ్ల కాలంలో రెండు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఘనత నితీష్ సొంతం చేసుకున్నారు. బిజెపి నాయకులు సుశీల్ కుమార్ మోదీ కూడా ఉప ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిరువురు తప్ప మంత్రులుగా మరెవ్వరూ ప్రమాణ స్వీకారం చేయలేదు. మహాకూటమి నుంచి నితీష్ కుమార్ బయటకు రావడానికి కేంద్ర బిందువైన ఉప ముఖ్యమంత్రి, లాలూ ప్రసాద్ కుమారుడు తేజస్వీ యాదవ్ గురువారం ఉదయం గవర్నర్ను కలిశారు. శాసనసభలో అతి పెద్ద పార్టీగా ఉన్న తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఆయన కోరారు. ఈ విజ్ఞప్తిని గవర్నర్ తిరస్కరించారు.