చెన్నైకి తాకిన కేరళ సెగ...

SMTV Desk 2019-01-04 12:05:34  sabarimala temple, Women entry in Sabarimala Temple, kerala, Hindu activists, protest, HARTAL, cm vijayan

చెన్నై, జనవరి 4: కేరళ ఆందోళనలు చెన్నై వరకు విస్తరించాయి. చెన్నైలోని పల్లవరంలో భాజపా కార్యకర్తలు కేరళ సీఎం విజయన్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్రమంత్రి పొన్‌ రాధాకృష్ణన్‌ని అయ్యప్ప ఆలయంలోకి అనుమతించని కేరళ ప్రభుత్వం ఇద్దరు మహిళల్ని మాత్రం భారీ బందోబస్తుతో పంపిందని తమిళనాడు బీజేపీ చీఫ్‌ సౌందరరాజన్‌ విమర్శించారు. దీనిపై స్పందించిన సీఎం విజయన్‌ శబరిమల ఆలయంకు వెళ్లిన ఇద్దరి మహిళలను ప్రభుత్వం తీసుకెళ్లలేదని, వారు సాధారణ భక్తులలాగే ఆలయ సందర్శనకు వెళ్లారని చెప్పారు. వారిని హెలికాప్టర్‌లో తరలించారన్న వ్యాఖ్యల్ని ఆయన కొట్టిపారేశారు. ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ హర్తాళ్‌ చేయడమంటే సుప్రీంకోర్టు తీర్పును శంకించడమేనని పేర్కొన్నారు. మహిళల దర్శనం తరువాత ఆలయాన్ని శుద్ధిచేసిన పూజారుల తీరును కూడా విజయన్‌ తప్పుబట్టారు.


శబరిమలలోని అయ్యప్ప ఆలయంలోకి ఇద్దరు మహిళల ప్రవేశం కేరళ రాష్ట్రాన్ని రణరంగంగా మార్చింది. రాష్ట్రం అంతటా ఆందోళనకు దిగిన హిందూ సంస్థలు రోడ్లకు అడ్డంగా కాలిపోతున్న టైర్లను ఉంచి నిరసనకు దిగారు. దీంతో జనజీవనానికి, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఆందోళనకారుల దాడిలో పలువురు పాత్రికేయులు గాయాలపాలయ్యారు.