పూరీ నుంచి బరిలో ప్రధాని..

SMTV Desk 2019-01-03 17:57:50  Puri, Narendra Modi, bhuvaneswar, BJP

భువనేశ్వర్‌, జనవరి 3: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో వొరిస్సాలోని పూరీ నుంచి బరిలో దిగుతారని ఆ రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే ప్రదీప్‌ పురోహిత్‌ చెప్పారు. పూరి స్ధానం నుంచి ప్రధాని పోటీ చేసే అవకాశాలు 90 శాతం ఉన్నాయని ప్రదీప్ పురోహిత్‌ పేర్కొన్నారు. వొడిషా రాష్ట్ర ప్రజలు ప్రధాని పూరీ లోక్‌సభ స్ధానం నుంచి పోటీచేయాలని కోరుకుంటున్నారని, మోదీ సైతం పూరీ నుంచి పోటీకి మొగ్గుచూపే అవకాశం ఉందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

జగన్నాథుడు కొలువైన పూరీ నుంచి ప్రధాని మోదీని బరిలో దింపాలని బీజేపీ అగ్రనాయకత్వం యోచిస్తున్నదనే ఊహాగానాల నేపథ్యంలో బీజేపీ నేత చేసిన ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. 2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మోదీ జగన్నాధుడి ఆశీస్సులతోనే వారణాసి నుంచి విజయం సాధించారని, ఈసారి ఆయన పూరీ నుంచే ఎన్నికల శంఖారావం పూరిస్తారని బీజేపీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. వొడిషా ప్రజల పట్ల ప్రేమ కలిగిన ప్రధాని మోదీ ఈ ప్రాంత అభివృద్ధినీ కాంక్షిస్తారని చెప్పుకొచ్చారు.