కనీస వేతన బిల్లుకు కేంద్రం ఆమోద ముద్ర

SMTV Desk 2017-07-27 18:26:29  The minimum wage for workers, Union Council of Ministers, parlament, modi

న్యూఢిల్లీ, జూలై 27 : దేశంలోని కార్మికులకు కనీస వేతనం అమలు చేయడమే లక్ష్యంగా రూపొందించిన నూతన కనీస వేతన బిల్లుకు కేంద్ర మంత్రి మండలిని కార్మిక మంత్రిత్వ శాఖ ఆమోద ముద్ర వేసింది. ప్రధాని మోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. నాలుగు కార్మిక చట్టాలను విలీనం చేసి ఈ బిల్లును తీసుకొచ్చారు. ఇది చట్టరూపం దాల్చితే దేశవ్యాప్తంగా సుమారు 4 కోట్ల మంది ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుంది. కనీస వేతనాల చట్టం–1948, వేతనాల చెల్లింపు చట్టం–1936, బోనస్‌ చెల్లింపు చట్టం–1965, సమాన వేతనాల చట్టం–1976లు ఇందులో భాగం కానున్నాయి. బిల్లు ప్రకారం కేంద్రం నిర్దేశించే కనీస వేతనాలను రాష్ట్రాలు కూడా అమలుచేయాల్సి ఉంటుంది. అంతకు మించి కనీస వేతనాలను ఇచ్చే వెసులుబాటును రాష్ట్రాలకు కల్పించారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్‌ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. పార్లమెంట్‌ ఆమోదిస్తే వివిధ రాష్ట్రాల్లోని నైపుణ్యంలేని కార్మికులకు కనీస వేతన నిర్ధారణకు ఒక ఫార్ములా రూపొందించడానికి కేంద్రాన్ని ఈ బిల్లు అనుమతిస్తుందని చెప్పారు. అయితే ఆ కనీస వేతనం ఎంత ఉంటుందనేది వెల్లడించలేదు. ప్రతి ఏటా కోటి ఉద్యోగాల కల్పన అనేది అన్నింటికన్నా అతిపెద్ద సవాలని, దానికోసం కార్మిక చట్టాల్లో మార్పులు తేవాలని అన్నారు.