విశాఖపట్నం, డిసెంబర్ 29: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు పలువురు సినీనటులు మద్దతు పలుకుతున్నారు. ఇప్పటికే సినీనటులు పోసాని కృష్ణమురళీ, పృధ్వి, ఫిష్ వెంకట్, చోటా కె నాయుడు, సినీనటుడు కృష్ణుడు, జబర్దస్త్ టీం కలిసి తమ సంఘీభావం ప్రకటించారు. ఈ మధ్య సీనినటుడు భానుచందర్ కూడా పాదయాత్రలో వైఎస్ జగన్ ను కలిశారు. అయితే తాజాగా వైఎస్ జగన్ ను సినీనటుడు ఆలీ కలిశారు. జగన్ తో సుమారు గంటసేపు అలీ వ్యక్తిగతంగా మాట్లాడారు. జగన్ చేపట్టిన పాదయాత్రపై ఆలీ ప్రశంసలు కురిపించారు.
నిత్యం ప్రజల్లో ఉండాలనే తపనతో ఏడాది కాలంగా పాదయాత్ర చేస్తున్న వ్యక్తి వైఎస్ జగన్ అని ఆలీ అభిప్రాయపడ్డారు. అలాగే పాదయాత్రలో పార్టీకి వస్తున్న మైలేజ్ పై కూడా ఇరువురు చర్చించుకున్నారు. అలాగే ఆలీ జగన్ ఆరోగ్య సమస్యలు, విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో జరిగిన దాడిపై కూడా చర్చించుకున్నారు. పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ఆరోగ్య పరంగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆలీ సూచించారు. ఈ సందర్భంగా జగన్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారని ప్రచారం.