హైదరాబాద్, డిసెంబర్ 29: నగరంలోని ప్రగతి భవన్ లో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నీటిపారుదల, వైద్య, ఆరోగ్య శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కే జోషి, ప్రభుత్వ సలహాదారులు రాజీవ్ శర్మ, అనురాగ్ శర్మతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. నీటి పారుదల రంగానికి ప్రస్తుతం ఇస్తున్న ప్రాముఖ్యతను కొనసాగిస్తూనే విద్య, వైద్య రంగాలకు ఈ దఫా అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. కంటి వెలుగు శిబిరాలు నిర్వహించిన విధంగానే చెవి, ముక్కు, గొంతు, దంత పరీక్షలు నిర్వహించాలని సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరిలో చెవి, ముక్కు, గొంతు, దంత వైద్య శిబిరాలకు కార్యాచరణ రూపొందించాలని సూచించారు. అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ప్రతి పౌరుడి హెల్త్ ప్రొఫైల్ ను రూపొందించాలని ఆదేశించారు.