కృష్ణా, డిసెంబర్ 29: తిరువూరులోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహం -1లో కలుషితాహారం తిని 35 మంది విద్యార్థినులు ఆసుపత్రి పాలయ్యారు. వీరిని చికిత్స నిమిత్తం ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. క్రిస్మస్ సెలవులకు ఇంటికి వెళ్లి వచ్చిన విద్యార్థినులకు నిన్న రాత్రి 7 గంటలకు రాగి జావ, గంట వ్యవధిలో కోడి మాంసంతో కూడిన ఆహారాన్ని హాస్టల్ నిర్వాహకులు అందజేశారు. అయితే, ఈ రోజు ఉదయం 10 మంది విద్యార్థినులు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, జ్వరంతో అస్వస్థతకు గురికాగా వారిని సిబ్బంది చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పాఠశాలకు వెళ్లిన మరో 25 మంది విద్యార్థినులూ అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 31 మంది విద్యార్థినులకు చికిత్స అందించి తిరిగి హాస్టల్కు పంపివేశారు. మరో నలుగురు విద్యార్థినులకు ఇన్ పేషెంట్ వార్డులో మెరుగైన చికిత్స అందిస్తున్నారు.