హైదరాబాద్, డిసెంబర్ 29: దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి ఇంట్లో పెళ్లి హడావిడి మొదలయింది. రాజమౌళి కుమారుడు కార్తికేయ, జగపతిబాబు సోదరుడి కుమార్తె పూజా ప్రసాద్ల వివాహం రేపు (డిసెంబర్ 30) జరగనుంది. ఈ వేడుకను జైపూర్లోని ఓ ప్రైవేట్ హోటల్ వేదికగా జరుపుతున్నారు. ఈ పెళ్లి పనుల కోసం రాజమౌళి ఓ నెల రోజుల పాటు హాలిడేస్ కూడా తీసుకున్నారు. రాజమౌళి కుటుంబ సభ్యులతో పాటు పెళ్లికొడుకు, పెళ్లి కూతురు కూడా గురువారమే జైపూర్ చేరుకున్నారు.
ఈ పెళ్లి మహోత్సవానికి హాజరయ్యే అతిథులందరూ శుక్రవారం జైపూర్ ప్రయాణం అయ్యారు. ప్రభాస్, రానా, ఎన్టీఆర్, రామ్చరణ్, నాని, అనుష్క తదితరులు అతిథులుగా ఈ వేడుకలకు హాజరుకానున్నారు. మూడు రోజులు జరిగే వివాహ వేడుకల్లో ఈరోజు సాయంత్రం మెహందీ, సంగీత్ కార్యక్రమాలు జరగనున్నాయి. మెహందీ కార్యక్రమంలో 300మంది అతిథుల కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ లంచ్ హైలెట్గా ఉండబోతోందని సమాచారం. ఈ స్పెషల్ లంచ్లో రాజస్థానీ తాలీను గెస్ట్లందరికీ ప్రత్యేకంగా సర్వ్ చేయనున్నారట.