హైదరాబాద్, డిసెంబర్ 29: నగరంలోని రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫారాల విస్తరణ, పాదచారుల వంతెనల నిర్మాణ పనుల కారణంగా రైల్వే సంస్త పలు రైళ్ళ రాకపోకలను నిలిపి వేసింది. ఆ నిర్మాణ పనులు పూర్తయిన అనంతరం వాటిని మళ్ళీ నడిపిస్తామని అధికారులు వెల్లడించారు. సికింద్రాబాద్ – ఫలక్నుమా – ఉందానగర్ సెక్షన్తో పాటు సికింద్రాబాద్ – బొల్లారం – మేడ్చల్ – మనోహరాబాద్ సెక్షన్లలో ప్రస్తుతం నడుస్తున్న 31 రైళ్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
జనవరి 1వ తేదీ నుంచి మార్చి 31 వరకూ ఈ రైళ్లను రద్దు చేస్తున్నామని.. ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు. సికింద్రాబాద్ – ఫలక్నుమా మధ్య ఇప్పటికే ఎంఎంటీఎస్ రైళ్లు తిరుగుతున్నాయని ఈ సర్వీసులను ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరారు.