హైదరాబాద్,డిసెంబర్ 28: గురువారం ఛైర్మన్ రంగారెడ్డి అధ్యక్షతన తుంగభద్ర నదీ బోర్డు సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో తెలంగాణ, ఏపి,కర్ణాటక నీటిపారుదల ఇంజీనీర్లు, ఇతర సభ్యులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బోర్డు ఛైర్మన్ రంగారెడ్డి మాట్లాడుతూ మూడు రాష్ట్రాలకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చించినట్లు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో తుంగభద్ర రిజర్వాయర్లో పూడిక వల్ల కోల్పోయిన నీటిని వినియోగించుకునేందుకు ప్రత్యామ్నాయంగా వరద కాలువను, కొత్త రిజర్వాయర్ను నిర్మించుకుంటామని కర్ణాటక రాష్ట్రం తుంగభద్ర బోర్డుకు ప్రతిపాదించింది. 40 టీఎంసీల నిల్వతో నిర్మించే రిజర్వాయర్ల సామర్థ్యాన్ని అవసరమైతే 52 టీఎంసీల వరకు పెంచుకునేందుకు వీలుంటుందని పేర్కొంది. ఈ పథకానికి 2015-16 ధరల ప్రకారం రూ.9,500 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. సంబంధిత ప్రతిపాదనలను తాజాగా తుంగభద్ర బోర్డుకు అందజేసింది. తుంగభద్ర రిజర్వాయర్(కర్ణాటక రాష్ట్రం హోస్పేట వద్ద ఉంది) పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 132.47 టీఎంసీలుగా 1953లో అంచనా వేశారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల అభిప్రాయాల తర్వాత నిర్ణయం.