హైదరాబాద్, డిసెంబర్ 26: నగరంలో గతేడాది తో పోలిస్తే ఈ సంవత్సరంలో నేరాల సంఖ్య తగ్గిందని నగర కమిషనర్ అంజనీ కుమార్ వెల్లడించారు. ఈ రోజు మీడియాతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ 2018లో వారు ఎదుర్కొన్న క్లిష్ట పరిణామాల గురించి చెప్పుకొచ్చారు. గతేడాదితో పోలిస్తే 6శాతం నేరాలు తగ్గాయని అలాగే ప్రాపర్టీ క్రైమ్ లో 20శాతం, వరకట్న చావు కేసులు 38శాతం, కిడ్నాప్ కేసులు 12శాతం, లైంగిక వేధింపులు 7శాతం తగ్గాయని ఆయన పేర్కొన్నారు.
నగరంలో సంచలనం సృష్టించిన కేసులన్నింటినీ అతి తక్కువ సమయంలోనే చేధించినట్లు అంజనీ కుమార్ తెలిపారు. ఎన్నికల సమయంలో రూ.29కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. 2018 ఏడాదికి గాను స్మార్ట్ సిటీ అవార్డ్, ఈ గవర్నెన్స్ అవార్డు అందుకున్నామన్నారు. ఈ ఏడాది మర్డర్ కేసులు 8శాతం పెరిగాయని.. అదేవిధంగా చైన్ స్నాచింగ్ కేసులు 62శాతం తగ్గాయని చెప్పారు. డ్రంక్ డ్రైవ్ కేసులు మాత్రం 41శాతం పెరిగినట్లు ఆయన వివరించారు.