దేశంలో పెరుగుతున్న ఆర్థిక నేరగాళ్లు ...!!

SMTV Desk 2018-12-26 15:54:06  Vijay Mallya, Nirav Modi, Mehul Choksi

న్యూఢిల్లీ, డిసెంబర్ 26: భారత దేశంలో బ్యాంకులకు వేలకోట్ల ఋణాలు ఎగనామం పెట్టి విదేశాలకు పరారైన ఆర్థిక నేరగాళ్లలో విజయ్ మాల్యా , నిరవ్ మోది పేర్లు మాత్రమే మనకి ఎక్కువగా తెలిసినవి. కాగా, ఈ వైట్‌కాలర్‌ నేరగాళ్ల ముఠా రోజు రోజుకి పెరుగుతుంది. తాజాగా 58కి చేరిన మాల్యా ముఠా. ఈ నేరగాళ్లను వెనక్కి రప్పించడానికి భారత ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీ మాత్రమే కాదు వారితో పాటు మొహుల్‌ చోక్సీ, లలిత్‌ మోదీ, నితిన్, చేతన్‌ సందేస్రా, యూరోపియన్‌ దళారీ గ్యూడో రాల్ఫ్‌ హస్చకే, కార్ల్‌ గెరోసాలను వెనక్కి రప్పించడానికి లుక్‌అవుట్‌ సర్క్యులర్స్‌ (ఎల్‌ఓసీ), ఇంటర్‌పోల్‌ ద్వారా నోటీసులు జారీ చేశామని కేంద్రం పేర్కొంది. అమెరికా, బ్రిటన్, బెల్జియం, యూఏఈ, ఈజిప్ట్, అంటిగా, బార్బుడా దేశాల్లో తలదాచుకుంటున్న ఆర్థిక నేరగాళ్లను తమకు అప్పగించాల్సిందిగా భారత్‌ ఆయా దేశాల ప్రభుత్వాలకు అభ్యర్థనలను సమర్పించింది.

ఆయా దేశాల ప్రభుత్వాలపై మరింత వొత్తిడిపెంచుతున్నామని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభకు తెలిపింది. వీవీఐపీ హెలికాప్టర్ల స్కామ్‌లో మధ్యవర్తిగా వ్యవహరించిన గ్యూడో రాల్ఫ్, కార్లో గెరోసాల అప్పగింత అభ్యర్థన, సంబంధిత నోటీసుల తాజా పరిస్థితిని విదేశాంగ శాఖ లోక్‌సభకు నివేదించింది. గెరోసా అప్పగింతపై గత ఏడాది నవంబర్‌లో, గ్యూడో అప్పగింతపై ఈ ఏడాది జనవరిలో అభ్యర్థనలు పంపిస్తే వాటిని ఇటలీ ప్రభుత్వం తిరస్కరించిందని తెలిపింది. రూ.13 వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టిన మెహుల్‌ చోక్సీ అప్పగింతపై 2 అభ్యర్థనలు పెండింగ్‌లో ఉన్నాయి. చోక్సీపై ఇంటర్‌పోల్‌ ద్వారా నోటీసులు జారీ అయ్యాయి.

స్టెర్లింగ్‌ బయోటెక్‌ ద్వారా బ్యాంకులకు 5వేల కోట్లు పైగా ఎగ్గొట్టిన చేతన్, నితిన్, దీప్తి సందేసర, హితేష్‌కుమార్‌ పటేల్‌లపై రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ అయ్యాయి. గుజరాత్‌కు చెందిన వ్యాపారి ఆశిష్‌ జోబన్‌పుత్ర, ఆయన భార్య ప్రీతిని అమెరికా నుంచి రప్పించడానికి ట్రంప్‌ సర్కార్‌కు భారత్‌ ఇప్పటికే అప్పగింత విజ్ఞప్తులు పంపింది. దీపక్ తల్వార్‌ను యూఏఈ నుంచి తీసుకురావడానికి అవసరమైన న్యాయపోరాటం చేస్తోంది. అగస్టా కుంభకోణం కేసులో మధ్యవర్తి క్రిస్టియన్‌ మిషెల్‌ను వెనక్కి తీసుకురావడంలో సక్సెస్‌ సాధించిన బీజేపీ సర్కారు మిగిలిన వారినీ తీసుకువస్తామన్న ఆత్మవిశ్వాసంతో ఉంది.

మెహుల్‌ చోక్సీ :
అనారోగ్య కారణంగా 41 గంటలు విమానంలో ప్రయాణించి తాను భారత్‌కు రాలేనని బ్యాంకులను మోసగించి పారిపోయిన మెహుల్‌ చోక్సీ తాజాగా ముంబైలోని ఓ కోర్టుకు తన న్యాయవాది ద్వారా తెలిపారు. చోక్సీ ప్రస్తుతం ఆంటిగ్వాలో ఉంటున్నారు. ఆయనకు ఆ దేశ పౌరసత్వం కూడా ఉంది. అయితే అతణ్ని భారత్‌కు తిరిగి రప్పించి విచారించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) వంటి సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. చోక్సీ ముంబైలోని కోర్టుకు తన పరిస్థితి వివరిస్తూ, ఆరోగ్యం బాగా లేనందున 41 గంటలపాటు తాను ప్రయాణించలేనని చెప్పారు.