విశాఖపట్నం, డిసెంబర్ 26: పాయకరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, తెదేపా నేత వంగలపూడి అనితకు తమ పార్టీ నేతలు షాక్ ఇచ్చారు. తమ నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టిన అనితకు పాల్తేరులో పార్టీ నేతలే తనని అడ్డుకున్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నుంచి గెలిచిన ఎంపీటీసీని ఆహ్వానించకపోవడం, పార్టీ అవిర్భావం నుంచి కష్టపడి పనిచేస్తున్న నాయకులను పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ మంగళవారం పాల్తేరులో పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.పార్టీ ఆవిర్భావం నుంచి తాము టీడీపీ గెలుపుకోసం పనిచేస్తున్నామని మీరు ఎమ్మెల్యేగా విజయం సాధించడంలో మా కృషి కూడా ఉందని, అలాగే స్థానిక ఎంపీటీసీ లోవతల్లి కూడా సైకిల్ గుర్తుపైనే గెలిచారని గుర్తుచేశారు.
గ్రామంలో పాదయాత్ర జరుగుతున్న విషయం తమకు గా ని, ఎంపీటీసీకిగానీ ఎందుకు తెలియజేయలేదని నిలదీశారు. గ్రామంలో వొక్క అభివృద్ధి పని కూడా జరగడం లేదని, అధికార పార్టీ తరపున గెలిచిన ఎంపీటీసీకి పార్టీలోనే విలువ లేకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. తమకు సమాధానం చెప్పిన తర్వాతే ఇక్కడ నుంచి కదలాలని అప్పటివరకు పాదయాత్ర ముందుకు సాగనివ్వమని భీష్మించారు.దీంతో ఆమె పరిస్థితిని అదుపుచేసేందుకు ప్రయత్నించారు. ఎంపీటీసీకి సమాచారం ఇవ్వకపోవడం తన తప్పేనని అంగీకరించారు. అందుకు ఎంపీటీసీకి, కార్యకర్తలకు క్షమాపణలు తెలియజేశారు. దీంతో కార్యకర్తలు తమ నిరసనను విరమించుకున్నారు.