నిర్మల్, డిసెంబర్ 24: ఈ రోజు జిల్లాలో నియోజకవర్గ కార్యకర్తల సమావేశాన్ని ప్రాంత ఎమ్మెల్యే, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో త్వరలో జరగబోయే పంచాయితీ ఎన్నికల్లో సత్తా చాటాలని తమ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దేశంలోని ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని, ప్రభుత్వ పథకాలైన రైతుబంధు, రైతు భీమా పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. కేటిఆర్ పార్టీ పగ్గాలు చేపట్టడంతో టిఆర్ఎస్ మరింత బలోపేతమవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
ఏ పార్టీకైనా కార్యకర్తలే ముఖ్యమన్నారు. పార్టీ బలోపేతం కోసం పనిచేసే కార్యకర్తలకు తగిన గుర్తింపునివ్వడం జరుగుతుందన్నారు. గ్రామ పంచాయితీల్లో సాధ్యమైనంత వరకు ఏకగ్రీవం అయ్యేలా చూసుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఏకగ్రీవంగా ఎంపికైతే రూ.10 లక్షలు, తండాలు ఏకగ్రీవం ఐతే రూ. 25 లక్షలు అభఙవృద్ధికి ప్రభుత్వం కేటాయిస్తుందన్నారు. త్వరలో కేటిఆర్ నాయకత్వంలో 33 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు.