హైదరాబాద్, డిసెంబర్ 24: నగరంలో అత్యాచారాలకు కొదవ లేకుండా పోతుంది. ఎక్కడ చూసిన చిన్నా పెద్దా ముసలి అనే తేడా లేకుండా అందరిపై విరుచుకుపడుతున్నారు కామపిశాచులు. తాజాగా నగరంలోని సనత్ నగర్ లో గేమ్స్ ఆడుకోవడానికి స్మార్ట్ ఫోన్ ఇస్తానని ఆశచూపి నాలుగేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బిహార్ కి చెందిన ఇంజమామ్(19) అనే యువకుడు కుటుంబంతో సహా హైదరాబాద్ కి వలస వచ్చి ఇక్కడ సనత్ నగర్ లో స్థిరపడ్డారు. అదే ప్రాంతంలో బిహార్ నుంచి వలస వచ్చిన మరో కుటుంబం కూడా ఉంది. ఆ కుటుంబానికి చెందిన నాలుగేళ్ల బాలికపై ఇంజమామ్ కన్నుపడింది. శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో గేమ్స్ ఆడుకోవడానికి స్మార్ట్ ఫోన్ ఇస్తానని ఆశచూసి ఇంజమామ్ మైనర్ బాలికను ఇంటికి తీసుకువచ్చాడు. అనంతరం బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కాగా తనకు జరిగిన విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు వివరించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధిత బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు ఇంజమామ్ ని పోస్కో చట్టం కింద అరెస్టు చేసి.. విచారిస్తున్నారు.