విశాఖపట్నం, డిసెంబర్ 23: ఆదివారం అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలపై శ్వేత పత్రాలను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో బాబు మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని గతంలో టీఆర్ఎస్ డిమాండ్ చేసిందని, ఎన్నికల సమయంలో ఆ పార్టీ ఎందుకు యూ టర్న్ తీసుకొందో చెప్పాలని అలాగే ఏపీకి ప్రత్యేక హోదా వద్దన్న టీఆర్ఎస్కు వైసీపీ ఎలా మద్దతిస్తోందో చెప్పాలని బాబు డిమాండ్ చేశారు. గతంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కవిత, కేసీఆర్లు ప్రకటించిన విషయాన్ని బాబు గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు కూడ ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారని చెప్పారు.
తెలంగాణలో టీఆర్ఎస్కు వైసీపీ మద్దతిస్తూ తెలంగాణలో టీఆర్ఎస్ విజయం సాధిస్తే ఏపీలో సంబరాలు నిర్వహించుకొన్నారని బాబు గుర్తు చేశారు.తెలంగాణలో టీఆర్ఎస్ విజయం సాధిస్తే వాళ్లు విజయం సాధించినట్టు, తాను ఓడిపోయినట్టుగా భావించి సంబరాలు చేసుకొన్నారని పరోక్షంగా వైసీపీ నేతలపై బాబు విమర్శలు గుప్పించారు. తెలంగాణకు తాను ఏనాడూ కూడ వ్యతిరేకంగా మాట్లాడలేదని బాబు మరోసారి స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాలు అభివృద్దిలో ముందుకు సాగాలనేది తన అభిమతంగా చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వొద్దని డిమాండ్ చేస్తున్న టీఆర్ఎస్తో వైసీపీ నేతలు అంటకాగుతున్నారని బాబు ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా వద్దని చెప్పిన పార్టీకి మద్దతిచ్చిన వైసీపీ కూడ ఏపీకి అన్యాయం చేసేందుకు ప్రయత్నిస్తోందని బాబు ఆరోపించారు.