విశాఖపట్నం, డిసెంబర్ 23: తెరాస అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర శేకర్ రావు కొద్దిసేపటి క్రితం విశాఖపట్నం చేరుకున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా దేశవ్యాప్తంగా పర్యటనలు చేస్తానన్న కేసీఆర్.. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో తన తొలి యాత్రను చేపట్టారు. కుటుంబసభ్యులతో కలిసి ఉదయం బేగంపేట విమానాశ్రయానికి చేరకున్న కేసీఆర్ ప్రత్యేక విమానంలో బయలుదేరి విశాఖ చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయంలో పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు.
చంద్రశేకర్ రావును చూసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో ఎయిర్పోర్ట్ వద్దకు రావడంతో అక్కడ పండగ వాతావరణం నెలకొంది. బయటకు వచ్చిన తర్వాత కేసీఆర్ జనానికి అభివాదం చేశారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శారదాపీఠానికి చేరుకున్నారు. అక్కడ స్వరూపానంద ఆశీస్సులు తీసుకుని కేసీఆర్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు.