కేసీఆర్ తో సమావేశమైన కేంద్రమంత్రి

SMTV Desk 2018-12-22 20:03:03  Central minister, Harshavardhan, Kookatpally, CM, KCR

హైదరబాద్, డిసెంబర్ 22: ఈరోజు కూకట్‌పల్లిలో జాతీయ మహసముద్ర సమాచారం కేంద్రంలో అంతర్జాతీయ మహాసముద్ర కార్యాచరణ విజ్ఞాన శిక్షణ కేంద్రాన్ని కేంద్రమంత్రి హర్షవర్ధన్‌ ప్రారంభించారు.అనంతరం ముఖ్యమంత్రి కేసిఆర్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణలో పచ్చదనం పెంచడానికి కేంద్రం తగిన సహకారం అందించాలని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్థన్‌ను కోరారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇవాళ తెలంగాణ పర్యటనకు విచ్చేసిన హర్షవర్థన్ సాయంత్రం ప్రగతిభవన్‌లో సీఎంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మొక్కల పెంపకం, అడవుల రక్షణ, అటవీ భూభాగంలో అడవి పునరుజ్జీవం, వన్యప్రాణులు సంరక్షణ, పర్యావరణ సంరక్షణ తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా హరితహారం కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందించారు. హైదరాబాద్ లో 188 ఫారెస్టు బ్లాకులను అభివృద్ధి చేస్తున్నామని, దీనికోసం కాంపా నిధుల్లో కేంద్రం వాటా నుంచి రూ.100 కోట్లు రాష్ట్రానికి కేటాయించాలని కేసీఆర్ మంత్రికి విజ్ఞప్తి చేశారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం స్టేజ్ 2 పర్యావరణ అనుమతులు సత్వరం వచ్చేలా చూడాలని హర్షవర్థన్‌ను కోరారు.

కాంపా నిధులతో చేపట్టే పనుల్లో 80 శాతం మౌలికమైన అటవీ అభివృద్ధి పనులు, 20 శాతం అనుబంధ పనులు ఉండాలని నిర్ధేశించారని, అయితే దీనికి బదులుగా సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం నిష్పత్తిని 70:30 గా మార్చాలని కోరారు. తెలంగాణకు జీవనాడి లాంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చినందుకు ఆయనకు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు‌ను తిలకించడానికి మరోసారి రావాల్సింది కేసీఆర్, హర్ష్‌వర్ధన్‌ను ఆహ్వానించగా.. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. అంతకు ముందు ఇటీవలి ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు కేసీఆర్‌ను మంత్రి అభినందించారు.