చెన్నై, డిసెంబర్ 22: తమిళనాడులో త్వరలో రానున్న లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ ఖచ్చితంగా పోటీచేస్తుందని ప్రముఖ నటుడు కమల్ హాసన్ తెలిపారు. తాజాగా ‘మక్కల్ నీది మయ్యం పేరుతో పార్టీ స్థాపించి కమల్ తన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. జయలలిత, కరుణానిధిల మరణంతో తమిళనాడు రాజకీయాల్లో శూన్యం ఏర్పడింది. ఈ నేపథ్యంలో కమల్ కీలక ప్రకటన చేశారు. శనివారం చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 2019లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో తన పార్టీ పోటీ చేస్తుందని ఆయన ప్రకటించారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ ఘనవిజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
తమిళనాడులోని 39 లోక్ సభ స్థానాల్లో అభ్యర్థులను నిలబెడతామని స్పష్టం చేశారు. 2014లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో జయలలిత నాయకత్వంలోని అన్నాడీఎంకే 39 స్థానాలకు గానూ 37 చోట్ల విజయదందుభి మోగించింది. మరోవైపు బీజేపీ, పీఎంకే చెరో సీటును దక్కించుకున్నాయి. డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు ఈ ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయాయి.