హైదరాబాద్, డిసెంబర్ 21: నేడు నగరానికి శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రాబోతున్నారు. ప్రతి ఏటా శీతాకాలంలో రాష్ట్రపతి హైదరాబాద్లోని రాష్ట్రపతి భవన్లో గడుపుతారు. ఈసారి పర్యటనలో భాగంగా డిసెంబర్ 21 నుంచి 24 వరకు ఆయన ఇక్కడ ఉంటారు.
సాయంత్రం 5.05 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హకీంపేట విమానాశ్రయానికి రాష్ట్రపతి చేరుకుంటారు.
అక్కడ ఆయనకు గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు.
పర్యటనలో భాగంగా రేపు కరీంనగర్లోని ప్రతిమ వైద్య కళాశాలలో జరిగే సదస్సులో రామ్నాథ్ కోవింద్ పాల్గొంటారు. 23న రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రమంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ రంగాల ప్రముఖులకు రాష్ట్రపతి విందు ఇస్తారు. 24న రామ్నాధ్ కోవింద్ తిరిగి ఢిల్లీకి వెళతారు.