జనవరిలో అభ్యర్థుల ప్రకటన చేయనున్న చంద్రబాబు..!

SMTV Desk 2018-12-20 18:55:38  Chandrababu, TDP, AP Elections

అమరావతి, డిసెంబర్ 20: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జనవరిలో టీడీపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది మంది అభ్యర్థుల జాబితాను సిద్దం చేసుకొన్నారు. ఈ సంక్రాంతి తర్వాత సుమారు వంద మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. అభ్యర్థులను ముందుగా ప్రకటించకపోతే గత ఎన్నికల్లో గెలుపు సాధించాల్సిన కొన్నిచోట్ల ఓటమి పొందాల్సి వచ్చింది ఆ ఫలితాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలని బాబు ప్లాన్ చేస్తున్నారు.

ముందుగా అభ్యర్థుల ప్రకటన కారణంగా పార్టీకి నష్టం వాటిల్లకుండా ఉండేలా బాబు చర్యలు తీసుకుంటున్నారు. ఎటువంటి ఇబ్బందులు లేని నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లు తొలి జాబితాలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. మార్పులు చేర్పులు కూడ తొలి జాబితాలో ఎక్కువగా ఉండకపోవచ్చు. దీంతో ఖచ్చితంగా గెలుస్తారు అనేవారికే టిక్కెట్లను కేటాయించాలని ఆయన భావిస్తున్నారు. ప్రజలతో సత్సంబంధాలను కలిగి ఉన్న వారికే టిక్కెట్లను కేటాయించనున్నారు. తొలి జాబితా తర్వాత విడతల వారీగా అభ్యర్థులను ప్రకటించనున్నారు. అభ్యర్థులను మార్చాల్సిన చోట తప్పకుండా వారికి టిక్కెట్లను నిరాకరించనున్నారు. కాగా, వారికీ నామినేటేడ్ పదవులు కేటాయించనున్నట్టు సమాచారం.