న్యూ ఢిల్లీ, డిసెంబర్ 19: కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ఎన్నికల సమయంలో ఐదు రాష్ట్రాలో విస్తృత ప్రచారం చేసి ప్రస్తుతం విశ్రాంతి కోసం షిమ్లాకు వెళ్లారు. ఆయనతో పాటు సోదరి ప్రియంకా గాంధీ, ఆమె పిల్లలు కూడా వెళ్లారు. మంగళవారం రోడ్డు మార్గం ద్వారా వారు షిమ్లాకు వచ్చారని స్థానిక కాంగ్రెస్ నాయకుడు వొకరు వెల్లడించారు. మధ్యలో సోలన్ జిల్లాలో ఓ దాబా వద్ద ఆగి రాహుల్, ప్రియాంక వాద్రా చిరుతిళ్లు, తేనీరు సేవించారని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న కొంత మంది స్థానిక కాంగ్రెస్ నేతలు దాబాకు వెళ్లి రాహుల్ను కలిసి, కాంగ్రెస్ విజయంపై అభినందనలు తెలిపారని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ పర్యటనకు తాను వ్యక్తిగతంగా వచ్చానని, చరబ్రా జిల్లాలోని ఓ హోటల్లో బస చేస్తామని రాహుల్ చెప్పినట్లు కాంగ్రెస్ నాయకుడు తెలిపారు.