28 మంది జాలర్లు గల్లంతు..!

SMTV Desk 2018-12-18 15:35:54  Pethai Cyclone, Fishermans Missing, East Godavari District

తూర్పుగోదావరి, డిసెంబర్ 18: బంగాళాఖాతంలో ఏర్పడిన పెథాయ్ తుపాను ఆంధ్రప్రదేశ్ ను తీవ్రంగా వణికించిన సంగతి తెలిసిందే. భారీ వర్షాలతో పాటు ఈదురు గాలులకు పలు జిల్లాల్లో పంటలు నేలమట్టం కాగా, ఆక్వా రైతులు సైతం తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. తుపాను తీరం దాటినప్పటికీ మరో మూడ్రోజుల పాటు వర్షాలు కురవడంతో పాటు చల్లటి గాలులు వీస్తాయి అని వాతావరణ శాఖ తెలిపింది. పెథాయ్ తాకిడి నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో 28 మంది మత్స్యకారులు గల్లంతయ్యారు. తుపాను రాకముందు నాలుగు పడవల్లో సముద్రంలోకి వెళ్లిన జాలర్లు, అక్కడే చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

ఉప్పలంక, దుమ్ములపేట, పర్లాపేటకు చెందిన 28 మంది జాలర్ల జాడ తెలియడం లేదు. కాగా, గల్లంతయిన జాలర్ల కోసం ఎన్డిఆర్ఎఫ్ అధికారులు రంగంలోకి దిగి గాలింపు చర్యలు ప్రారంభించారు. అంతకుముందు సముంద్రంలో ఓఎన్ జీసీ రిగ్ వద్ద చిక్కుకున్న ఏడుగురు జాలర్లను అధికారులు కాపాడగలిగారు. పెథాయ్ తుపాను ప్రభావంతో 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. తమ కుటుంబ సభ్యుల జాడ తెలియకపోవడంలో మత్స్యకారుల కుటుంబాలు, బంధువులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.