రేవంత్ అరెస్ట్ పై విచారణ జరిపిన ధర్మాసనం..!

SMTV Desk 2018-12-18 12:13:06  Revanth Reddy, KCR, Telangana Elections case

కొడంగల్, డిసెంబర్ 18: తెలంగాణాలో ఎన్నికల సందర్బంగా కోస్గిలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరౌతున్నారన్న సభలో అల్లర్లు సృష్టించేందుకు అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ వర్గాల సూచన మేరకు శాంతి భద్రతల దృష్ట్యా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని అరెస్టు చేసినట్లు వికారాబాద్ మాజీ ఎస్పీ అన్నపూర్ణ హైకోర్టుకు తెలిపారు. పోలీసులు చట్టవిరుద్ధంగా రేవంత్ రెడ్డి ని నిర్భందించారని, ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియడం లేదని మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై న్యాయమూర్తులు జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.

కాగా, ఆరోజు రేవంత్ ని అరెస్టు చేయడానికి గల కారణాలను ఎస్పీ అన్నపూర్ణ వివరించారు. రేవంత్ ని అరెస్టు చేయడానికి ముందు చాలసార్లు బయటకు రావాలని ఆయనని పిలిచామని.. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో గేట్లు పగలగొట్టి లోనికి వెళ్లాల్సి వచ్చిందన్నారు. గదిలో రేవంత్ రెడ్డితో పాటు ఆయన భార్య, కుమార్తె కూడా ఉన్నారని.. వారికి రేవంత్ అరెస్ట్ కు గల కారణాలు వివరించి వాటికి సంబంధించిన పత్రాలపై సంతకాలు పెట్టాలని కోరగా వారు నిరాకరించారని ఆమె తెలిపారు. బెడ్ రూమ్ లోకి వెళ్లి అరెస్ట్ చేసారు అనేదానిపై ఆమె మాట్లాడుతూ అది బెడ్ రూమ్ అని మాకు తెలియదని అన్నారు.