న్యూఢిల్లీ, జూలై 26 : ఇటీవల రాష్ట్రపతిగా పదవి విరమణ చేసిన ప్రణబ్ ముఖర్జీ ప్రస్తుతం ఏం చేయనున్నారనే దానిపై మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేత మణి శంకర్ అయ్యర్ ఓ మీడియాతో మాట్లాడుతూ ముఖర్జీ కాంగ్రెస్ పార్టీకి సలహాలు ఇవ్వడం ప్రారంభిస్తారని ఆశిస్తున్నానని అయితే, ఈ విషయంలో తనకు కూడా స్పష్టంగా తెలియదని వ్యాఖ్యానించినప్పటి నుంచి ఈ చర్చ మొదలైంది. కాగా, దీనిపై ప్రణబ్ కుమారై శర్మిష్ట స్పందిస్తూ.... మా నాన్న రాష్ట్రపతి బాధ్యతలు చేపట్టాక రాజకీయాలకు అతీతంగా వెళ్లారు. ఒక్క కాంగ్రెస్ పార్టీకే కాకుండా అన్ని పార్టీలకు ఆయన సహాయ సహకరాలు అందించారు. అందుకే అన్ని పార్టీల వాళ్లు ఆయనను గౌరవిస్తారంటూ శర్మిష్ట వెల్లడించారు. ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి తన తండ్రి రారని ఈ మేరకు ఆమె అన్నారు.