హైదరాబాద్ , డిసెంబర్ 16: తెలంగాణతో సహా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి ఓడిపోవడంపై తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటిఆర్ స్పందిస్తూ, లోక్సభ ఎన్నికలలో కూడా మళ్ళీ ఇదేవిధంగా ఫలితాలు పునరావృతం కానున్నాయి. రాష్ట్రంలో బిజెపి 119 స్థానాలకు పోటీ చేయగా 103 స్థానాలలో డిపాజిట్లు కోల్పోయింది. వొకే వొక్క స్థానంలో గెలువగలిగింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడుతో సహా సీనియర్ నేతలందరూ ఓడిపోయారు. 2019 లోక్సభ ఎన్నికలలో తెరాస 17 స్థానాలలో 16 తప్పకుండా గెలుచుకొంటుంది. కనుక కాంగ్రెస్, బిజెపిలు రెంటికీ మళ్ళీ ఓటమి తప్పదు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పధకాల గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో చర్చ జరుగుతోంది. కనుక లోక్సభ ఎన్నికల తరువాత తెరాస జాతీయస్థాయిలో నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతుంది. దేశప్రధానిని నిర్ణయించే స్థాయికి ఎదుగుతుందని భావిస్తున్నాము,” అని అన్నారు.