ఎత్తు పెరగనున్న ఆల్మట్టి... ఇబ్బందులు ఎదుర్కోనున్న ఏపీ, తెలంగాణ.!

SMTV Desk 2018-12-15 11:25:36  Karnataka Government, Andhrapradesh, Telangana, Krishna Water Issue

కర్ణాటక, డిసెంబర్ 15: కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వం మరోసారి ఆల్మట్టి వివాదం తెరపైకి తెచ్చింది. కర్ణాటక ప్రభుత్వం కృష్ణానదిపై నిర్మించిన ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచుటకు సిద్ధంగా ఉన్నట్లు అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించింది. కృష్ణాజలాల వివాదాలను విచారిస్తున్న బ్రిజేశ్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ కృష్ణాలో నీటి లభ్యత 2578 టీఎంసీలుగా ఉందని తేల్చింది. ఈ నీటిని మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఏపీ (తెలంగాణ, ఏపీ) వినియోగించుకోవాలని సూచించింది. ప్రస్తుతం 519.60 మీటర్లుగా ఉన్న ఆల్మట్టి డ్యామ్ ఎత్తును 524.256 మీటర్లకు పెంచుతామని కర్ణాటక ప్రభుత్వం వెల్లడించింది. ఇందుకోసం దాదాపు రూ.30,143 కోట్లు ఖర్చు అవుతాయని పేర్కొంది. కాగా, గతంలో ఆల్మట్టి ఎత్తు పెంపుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.


కుమారస్వామి ప్రభుత్వం తాజా నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు ఇబ్బందులు ఎదురుకానున్నాయి. కర్ణాటక ప్రభుత్వం వొకవేళ 524 మీటర్లు ఆల్మట్టి ఎత్తును పెంచితే తెలుగు రాష్ట్రాలలోని జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులకు వరదనీరు తగ్గనుంది. ఇప్పటికే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కృష్ణా జలాలపై న్యాయ స్థానాల్లో పోరాడుతున్నాయి. తాజాగా కృష్ణా నదిపై ఆల్మట్టి ఎత్తును పెంచితే ఈ కష్టాలు మరింత తీవ్రం కానున్నాయి.