హైదరాబాద్, డిసెంబర్ 14: మెగా స్టార్ చిరంజీవి హీరోగా యువ దర్శకుడు సురేందర్ రెడ్డి 'సైరా' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి సగంపైగా షూటింగ్ చిత్రీకరించారు. తరువాతి షెడ్యూల్లో అండర్ వాటర్ యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారట. ఈ తరహా యాక్షన్ సీన్స్ ను కంపోజ్ చేయడంలో నిపుణులైనవారిని ముంబై నుంచి పిలిపించినట్లుగా తెలుస్తోంది.
అండర్ వాటర్లో జరిగే ఈ యాక్షన్ సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచేలా చూస్తున్నారట. ఏకధాటిగా కొన్ని రోజులపాటు అండర్ వాటర్లో యాక్షన్ దృశ్యాలను చిత్రీకరించనున్నట్టు చెబుతున్నారు. రిస్క్ తో కూడుకున్న ఈ సన్నివేశాల్లో చేయడానికి మెగాస్టార్ ఎంత మాత్రం వెనుకాడకపోవడం విశేషమని చెప్పుకుంటున్నారు. వచ్చే వేసవి సెలవుల్లో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.