నరసాపురం, డిసెంబర్ 14: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఆంధ్రాలో కూడా వేడి పుట్టించాయి... గెలుపుపై ఉత్కంఠత సాగింది.. చివరకు కేసీఆరే హీరో అయ్యారు.. టీఆర్ఎస్ గెలుపుతో ఇక్కడ కొంతమంది సంబరాలు కూడా చేసుకున్నారు. కేసీఆర్ ఫ్లెక్సీలు కూడా వెలిశాయి.. ఇవి వివాదాలకు దారితీస్తున్నాయి. ఈ ఫ్లెక్సీ ఏర్పాట్లు నచ్చనివాళ్ళు వాటిని తొలగించడం చేస్తున్నారు. గతంలో యూపీలో అఖిలేష్ యాదవ్, ఢిల్లీలో కేజ్రీవాల్ గెలిచినప్పుడు వారిని అభిమానించే కొందరు ఇక్కడ వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలు ఏర్పాటుచేసారు. వాటిని అప్పట్లో ఎవరూ తొలగించలేదు. కేసీఆర్ ఫ్లెక్సీనే తీసివేయడంపై చర్చ సాగుతోంది.
ఈ నేపథ్యంలో వైసీపీ అభిమానులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బాహుబలి అంటూ భారీ ఫెక్సీని బుధవారం పశ్చిమగోదావరి జిల్లాలో నరసాపురం బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేశారు. నిత్యం రద్దీగా ఉండే ప్రదేశం కాబట్టి అందరి చూపు దీనిపై పడింది. కేసీఆర్ పెద్ద సైజ్ ఫోటో పెట్టి, మధ్యలో వైసీపీ నాయకుల ఫోటోలు పెట్టారు. ఫ్లెక్సీలో తెలంగాణ బాహుబలికి శుభాకాంక్షలంటూ పేర్కొన్నారు, ఎక్కడా పార్టీల పేర్లు ప్రస్తావించలేదు. పట్టణంలో హాట్ టాఫిక్ అయిన ఈ ఫ్లెక్సీ గురువారం తెల్లవారుజామున ఫ్లెక్సీ కనిపించలేదు. అనుమతి లేనందువల్ల పురపాలక సంఘం తొలగించి ఉండవచ్చని దాన్ని ఏర్పాటు చేసిన అభిమానులు భావించారు. కానీ మున్సిపాల్టీ వాళ్ళు తొలగించలేదని తెలిసింది. దీంతో ఈ విషయంపై పోలీస్స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ఎస్సై పోలీసులకు సంబంధం లేదని స్పష్టం చేశారు.