హైదరాబాద్, డిసెంబర్ 12: మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ సనత్ నగర్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కూన వెంకటేష్ గౌడ్ పై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా నిన్న సాయంత్రం విజయోత్సవ వేడుకల్లో భాగంగా వెంకటేష్ గౌడ్ ఇంటి వద్దకు వెళ్లిన తలసాని కుటుంబసభ్యులు కొందరు టపాసులు పేల్చడంతో పాటు, అసభ్యంగా మాట్లాడారు. ఈ విషయంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు పోలీసులకు సమాచారం అందించడంతో... వారు అక్కడ నుంచి పారిపోయారు. అయితే, ఈ సంఘటన వీడియో తీసిన టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, కేటీఆర్ కు కూడా పంపారు.
ఈ సంఘటన గురించి తెలుసుకున్న తలసాని రాత్రి 8 గంటల సమయంలో బేగంపేటలో ఉన్న వెంకటేశ్ గౌడ్ నివాసానికి స్థానిక కార్పొరేటర్ తో కలసి వెళ్లి వెంకటేష్ గౌడ్ ను పరామర్శించారు. తమ వారు హంగామా చేసిన సంగతి తనకు తెలియదని, వారిని తాను మందలిస్తానని, మరోసారి ఇలా జరగకుండా చూస్తానని హామీఇచ్చారు.