హైదరాబాద్, డిసెంబర్ 12: ఉత్కంఠంగా సాగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బెట్టింగ్ బాబుల్ని గుబేలించాయి. తెలంగాణ ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పుడు పందేల హడావుడి పెద్దగా లేదు. కాని పోలింగ్ దగ్గర పడ్డ సమయంలో వొక సంస్థ ప్రముఖుడి సర్వే ఫలితాలతో సందడి మొదలైంది. తెలంగాణలో కంటే ఆంధ్రప్రదేశ్లోనే ఈ పందేల హడావుడి ఎక్కువగా ఉంది. వీటివల్ల లాభపడ్డవారి కంటే నష్టం మూటగట్టుకున్నవారే ఎక్కువ కావడం గమనార్హం. ప్రకాశం జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే టిఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని రూ. ఐదు కోట్లు పందెం కాసి రెట్టింపు లాభం పొందాడని సమాచారం.
ప్రకాశం జిల్లా కారంచేడు మండలంలోని ఓ వ్యక్తి ప్రజాకూటమి గెలుస్తుందని 5 ఎకరాలు పందెం కాశాడు, అదే జిల్లా రాజుపల్లి గ్రామంలో ఐదుగురు వ్యక్తులు కూటమి తరఫున రూ. 90 లక్షలు పందెం కాసి నష్టపోయారు. కృష్ణా జిల్లాలో ఎక్కువమంది కూకట్పల్లి మహాకూటమి అభ్యర్థి నందమూరి సుహాసినికి 10 వేల మెజార్టీ మించుతుందని పందెం కాశారు. తెరాస ఓడిపోతుందని పందెం కాసి గుంటూరు జిల్లాలో వొక రైతు 10 ఎకరాలు పొగొట్టుకున్నాడు. ఇంకా చిన్నచిన్న మొత్తాల్లో పందేలు కాసి నష్టం మూటగట్టుకున్న వారు వందల్లో ఉన్నట్లు అంచనా.