హైదరాబాద్, డిసెంబర్ 11: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఘోరపరాజయం చవిచూసింది. 2014 ఎన్నికల్లో ఐదు స్థానాల్లో గెలిచిన భాజపా.. ఈసారి వొకటి మినహా మిగతా అన్నిచోట్ల ఓటమిపాలైంది. ముఖ్య నాయకులు అయిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, సీనియర్ నేత కిషన్రెడ్డి కూడా ఓటమి చవిచూశారు. గోషామహల్ నుంచి భాజపా అభ్యర్థిగా బరిలోకి దిగిన రాజాసింగ్ విజయం సొంతం చేసుకున్నారు.
భాజపా ముఖ్య నాయకులు ప్రధాని నరేంద్రమోదీ, ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్రమంత్రులు రాష్ట్రంలో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ ఆ పార్టీకి కలిసిరాలేదు. కేవలం వొకే వొక్క స్థానంలో మాత్రమే గెలిచింది. అంబర్పేట, ముషీరాబాద్, ఖైరతాబాద్, గోషామహల్, ఉప్పల్ నియోజకవర్గాల్లో భాజపా గత ఎన్నికల్లో విజయపతాకం ఎగురవేసింది. ఇప్పుడు గోషామహల్ మినహా మిగతా ప్రాంతాల్లో ఓటమి పాలైంది. గతంలో భాజపా గెలుచుకున్న స్థానాల్లో తెరాస అభ్యర్థులే విజయం సాధించారు.