కోదాడ, డిసెంబర్ 5: తెలంగాణలో ఉన్న యువకులు, మహిళలు అమరులై తమ రక్తాన్ని ధారబోసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణాని భ్రష్టు పట్టిస్తున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీ అన్నారు. కేసీఆర్ ఏ ప్రాంతానికి వెళ్లినా ఆ ప్రాంతాలను దత్తత తీసుకుంటానని ఆయన ప్రకటిస్తున్నారు.. ఇటీవల నల్గొండ వచ్చిన సీఎం కేసీఆర్ ఏ పట్టణాన్ని దత్తత తీసుకుంటానని ప్రకటించారు అని విమర్శించారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతులు, అమరుల కుటుంబాలు, నిరాశ, నిస్పృహలో ఉన్న యువతను ఆదుకుంటాం అని హామీఇచ్చారు.
ఈ నాలుగున్నరేళ్ళ కాలంలో కేసీఆర్ కుమారుడు కేటీఆర్ ఆదాయం 400 శాతం పెరిగిందన్నారు. కేసీఆర్ సంపన్న రాష్ట్రంగా ఉన్న తెలంగాణను నేడు రెండున్నర లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో నెట్టారు అని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కేసీఆర్ కుటుంబానికి స్థాయికిమించి సంపద సమకూరిందని, యువతలో నైపుణ్యాభివృద్ది లోపించింది అని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం మినరల్ నీళ్లు తాగితే.. నల్గొండ ప్రజలు ఫ్లోరైడ్ నీళ్లు తాగాలా? అని రాహుల్ ప్రశ్నల బాణాలు వేశారు.