వాహనాల్లో డబ్బు తరలిస్తున్న తెరాస : ఉత్తమ్

SMTV Desk 2018-12-05 14:52:10  Uttamkumar Reddy, TRS

హైదరాబాద్,డిసెంబర్ 5: తెలంగాణలో ఎన్నికలకు ఇంక రెండురోజులే సమయం వుండటంతో అధికార టీఆర్ఎస్ డబ్బులు వెదజల్లేందుకు సన్నాహాలు చేస్తుంది అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఈ రెండు రోజులు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎంతో అప్రమత్తంగా ఉండాలనీ, ఎలాంటి పోరాటాలకైనా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ నేతలు డబ్బులను టీవీ9 వాహనాల్లో, అధికారుల కార్లలో, అంబులెన్సుల్లోనూ ఇంకా ఇతర వాహనాల్లోనూ తరలిస్తున్నారని ఆరోపించారు.

ఈ ఎన్నికల్లో మహాకూటమి ఘనవిజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు రూ.2 లక్షలు రుణం మాఫీ చేస్తామనీ, మొదటి సంవత్సరం లక్ష ఉద్యోగాలు, మెగా డీఎస్సీ కింద 20,000 టీచర్ ఉద్యోగాల కోసం ప్రకటనలు జారీ చేస్తామన్నారు. తెలంగాణలో ఉన్న 6 లక్షల మహిళా సంఘాలకు రూ.లక్ష చొప్పున గ్రాంట్ జారీచేస్తామని తెలిపారు. అంతేకాకుండా ప్రతీ సంఘానికి రూ.10 లక్షలు రుణం ఇస్తామన్నారు. దళితులు, గిరిజనులకు ఇంటి కోసం 250 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తామన్నారు.