హైదరాబాద్, జూలై 24 ː డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న సినీ నటి చార్మి హైకోర్టును ఆశ్రయించింది. డ్రగ్స్ కేసులో బ్లడ్ శాంపిల్స్ సేకరణ సరికాదని హైకోర్టులో రిట్ వేసింది. విచారణ తీరు సరిగా లేదని చార్మి ఆరోపించింది. చార్మి పిటిషన్ మధ్యాహ్నం విచారణకు వచ్చే అవకాశం ఉంది. డ్రగ్స్ కేసుకు సంబంధించి చార్మిని ఈ నెల 26వ తేదీన ఎక్సైజ్ ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించనుంది. ఇదిలా ఉండగా మరో వైపు చార్మికి డ్రగ్స్ మీద దృష్టి పెట్టేంత తీరిక, సమయం లేదని ఆమె తండ్రి దీప్ సింగ్ అన్నారు. అనవసరంగా ఆమెను ఈ కేసులో ఇరికించారని మండిపడ్డారు. దర్శకుడు పూరీ జగన్నాథ్కు కూడా ఈ కేసుతో ఎలాంటి సంబంధం ఉండదని, ఆయన ముత్యం లాంటి వాడని దీప్ సింగ్ కితాబిచ్చిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొంటున్న ముమైత్ఖాన్ విచారణపై సందిగ్ధం వీడింది. ఆమెను ఈ నెల 27న విచారించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు బిగ్ బాస్ కార్యక్రమ నిర్వాహకుల నుంచి ప్రత్యేక అనుమతి తీసుకున్న అధికారులు ఆమెను 27న సిట్ ముందు హాజరు కావాలని సూచించారు.