న్యూఢిల్లీ, జూలై 24 : భారతదేశ 13 వ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవి విరమణ చేయనున్న నేపధ్యం లో సోమవారం ఆయనకి పార్లమెంట్ సభ్యులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సెంట్రల్ హల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, ఉభయ సభ సభ్యులు పాల్గొని ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం ప్రణబ్ చేసిన కృషిని గుర్తుచేసుకున్నారు. పార్లమెంట్ తో తనకున్న బంధాన్ని స్మరిస్తూ ఎంపీలను ఉద్దేశించి ప్రసంగించిన ముఖర్జీ వేర్వేరు అంశాల పై వారికి కీలక సూచనలు చేశారు. కాగా రాజకీయాల్లోకి అడుగు పెట్టిన నాటి నుంచి దేశ ప్రధమ పౌరుడుగా బాధ్యతలు చేప్పటిన రోజు వరకు తన జీవితంలోనే పలు ఘట్టాలను గుర్తుచేసుకున్నారు. తన పదవి కాలం ముగిసినందుకు బాధ గా ఉన్నా, దేశ ప్రజలకు సేవ చేశానన్న తృప్తి తో వెళ్తున్నట్లు ఆయన తెలిపారు. పార్లమెంట్ లో బిల్లుల పై చర్చ కోసం మరింత సమయం కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రభుత్వం ఆర్డినేన్స్ మార్గాన్ని అనుసరించాలని ఆయన హితవు పలికారు. ప్రత్యేకించి వేర్వేరు అంశాల్లో ప్రధాని సహకారం లభించిందనందుకు మోదీకి కృతజ్ఞతలు తెలిపారు ఆయన. అయితే సోమవారం రాష్ట్రపతిగా పదవి విరమణ చేయనున్న ముఖర్జీకి పార్లమెంట్ సభ్యులు విశిష్ఠ కానుకలు అందించారు. అంతే కాకుండా హమీద్ అన్సారీ, సుమిత్ర మహాజన్ కలిసి ప్రణబ్ కు స్మృతి చిహ్నంతో పాటు ప్రణబ్ జీవిత విశేషాలతో ప్రత్యేకంగా రూపొందించిన కాఫీ టేబుల్ పై ఎంపీలంతా సంతకం చేసి ఓ పుస్తకాన్ని రాష్ట్రపతికి బహుకరించారు.