దెందులూరు, నవంబర్ 18: దెందులూరు నియోజకవర్గం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆగడాలను పోలీసులు అదుపు చేయలేకపోతున్నారు. ఇంత జరుగుతున్నా ఏపీ సీఎం స్పందించకపోవడం గమన్హారం. ఇసుక, మట్టిని అడ్డంగా తవ్వేస్తూ… కోట్ల రూపాయలను కొల్లగొడుతున్న చింతమనేని ప్రభాకర్ అరాచకాలను రెవెన్యూ, పోలీసు, జలవనరుల శాఖ అధికారులు సమర్థిస్తున్నారనిపిస్తోంది. ఈ విషయంలో మొదట్లోనే అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నించిన ఎమ్మార్వో వనజాక్షిని స్వయంగా ఎమ్మెల్యే చింతమనేని వచ్చి పచ్చి బూతులు తిట్టడమేకాదు, చేయి కూడా చేసుకున్నా దిక్కులేదు. స్వయంగా సీఎం చంద్రబాబునాయుడు ఆ కేసును నీరుగార్చాడు. రెవెన్యూ ఉద్యోగుల ఆందోళనల నేపథ్యంలో కాస్త వెనక్కితగ్గారు. ఆ తరువాత ప్రతిపక్ష నేతలపై, మీడియాపై, చివరకు విజిలెన్స్ అధికారులపై కూడా చింతమనేని అండ్ కంపెనీ భౌతిక దాడులు చేసి భయబ్రాంతులకు గురి చేస్తుంటే కేసు నమోదు చేయడానికి కూడా పోలీసులు ముందుకురావడం లేదంటే ఏపీలో పోలీసులు రాజకీయ నాయకుల గూండాగిరికి ఎంత తొత్తులుగా మారారో అర్థమైపోతోంది. ఇక రాజకీయ పార్టీల ధర్నాలు, ఆందోళనల నేపథ్యంలో కేసులు కడుతున్నా.. స్టేషన్ బెయిల్తో సరిపెడుతున్నారు. ఇలాంటి వొక రౌడీని ప్రభుత్వ విప్గా నియమించిన చంద్రబాబునాయుడును ప్రజలు ఏమనాలి? ఈయన బహిరంగసభల్లో చెప్పే శాంతిభద్రతల సూక్తులు విని దేనితో నవ్వాలో అర్థం కావడం లేదు. ఇక హోంమంత్రి చినరాజప్ప జిల్లాకు చెందిన ఎమ్మెల్యే అరాచకాలను అక్కడ ఎస్పీ కూడా ఆపలేకపోతున్నారంటే పోలీసుల దుస్థితి చూసి సిగ్గుపడాల్సి వస్తోంది. రోజు వందల లారీల, ట్రాక్టర్ల ఇసుక, మట్టిని అడ్డంగా తవ్వేస్తూ… అమ్మి కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటుంటే మనవాడేలే అంటూ పేరు గొప్ప సీఎం చంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్లు చూస్తున్నారు. మీడియాలో, ప్రతిపక్షాలో గట్టిగా వేలెత్తిచూపిస్తే, ఆందోళనలు, ధర్నాలు చేసి ప్రజల దృష్టిలో పెడితే…తన తొత్తులైన మీడియా రిపోర్టర్ల ద్వారా చింతమనేనిని గట్టిగా మందలించిన సీఎం చంద్రబాబు అంటూ పేపర్ టైగర్ ప్రకటనలు ఇప్పిస్తారు.
తెలుగుదేశానికే చెందిన మాజీ సర్పంచు చింతమనేని జలవనరుల శాఖకు చెందిన మట్టిని అడ్డంగా తోడేస్తూ సొమ్ము చేసుకుంటున్నాడని ఎవరికీ తెలియకుండా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. ఆ విషయం వెంటనే చింతమనేనికి ఎవరు చేరవేశారోకానీ…అదే రోజు మాజీ సర్పంచు ఇంటికెళ్లి చింతమనేని అనుచరులు కొట్టుకుంటూ జీపులో ఎమ్మెల్యే ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ మరోసారి ఎమ్మెల్యే, ఆయన గన్మెన్ కూడా ఆ మాజీ సర్పంచుపై విచక్షణారహితంగా కొట్టారు. చావుబతుకుల మధ్య ఉన్న అతన్ని గ్రామస్తులు తీసుకెళ్లి ఆస్పత్రిలో చేర్పించారు. ఆ గ్రామం మొత్తం తెలుగుదేశానికి వ్యతిరేకంగా వొక్కటై పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు చించేశారు. ఇక్కడ గ్రామస్తులంతా ఏకం కావడంతో మరుసటి రోజు చింతమనేని గ్రామానికి వెళ్లి క్షమాపణ చెప్పారు. కానీ అధికార పార్టీ నాయకుల ఆగడాలకు పోలీసులు ఎలా సహకరిస్తున్నారో ఈ ఉదంతంతో స్పష్టమైపోయింది. మాజీ సర్పంచ్ ఎస్పీని కలిసి చింతమనేనిపై ఫిర్యాదు చేసిన విషయం ఆఘమేఘాలపై ఎమ్మెల్యేకి ఎలా తెలిసింది? ఎస్పీ చెప్పారా? లేదా ఎస్పీ కార్యాలయం జలవనరులశాఖ అధికారులకు సమాచారం ఇస్తే, వారు ఎమ్మెల్యేకి చేరవేశారా? సమాచారం ఎవరు చెప్పారనేదానికంటే ఎమ్మెల్యే అరాచకాలను అరికట్టడానికి ఇటు పోలీసులు, అటు జలవనరులశాఖ అధికారులు ప్రయత్నించకపోవడం వ్యవస్థ విధ్వంసాన్ని సూచిస్తోంది. చింతమనేని అరాచకాల పరంపర కొనసాగడానికి రాష్ట్ర డిజిపి, సీఎం, హోంమంత్రి నైతిక బాధ్యత వహించాలి. పౌర సమాజానికి భేషరుతుగా క్షమాపణ చెప్పాలి. ఆ తరువాతే రాష్ట్రంలో సభల్లో, సమావేశాల్లో నీతులు, సూక్తులు వల్లించాలి. ఇది రాష్ట్రంలోని పౌరుల డిమాండ్.