అమారావతి, నవంబర్ 16: సంక్రాంతి పండుగ అనగానే ముఖ్యంగా కోడి పందాలు గుర్తొస్తాయి. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో కోడి పందాలు జోరుగా సాగుతాయి. సంక్రాంతి అనగానే కోడి పందాలకు సీజన్ మొదలైనట్టే. ఈ నేపథ్యంలో సంక్రాంతి కోడిపందాల సందడి ఇంటర్నెట్లో మొదలైంది. తమ వద్ద ఉన్న కోళ్ల ఫొటోలు, ధరలను పెంపకందారులు ఇంటర్నెట్లో ఉంచుతున్నారు. పందెంరాయుళ్లు వొక్కో పుంజును రంగును బట్టి రూ.30 వేల నుంచి రూ.50 వేలకు కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంతోపాటు చుట్టూ ప్రక్కల ఉన్న గుర్వాయగూడెం, నాగులగూడెం, పేరంపేట, పంగిడిగూడెం, బాట గంగానమ్మగుడి, శ్రీనివాసపురం, మైనస్నగూడెం, లక్కవరం, దేవులపల్లి, వెంకటాపురం ప్రాంతాల్లో ఆయిల్పామ్ తోటలలో పుంజులను పెంచుతున్నారు. చుట్టూ కంచెను ఏర్పాటుచేసి బయటకు కనబడకుండా చేస్తున్నారు. రెండేళ్లుగా సోషల్ మీడియాలో ఇంటర్నెట్లో విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయని కోడిపుంజుల వ్యాపారస్తులు చెబుతున్నారు..