ఉత్తరప్రదేశ్, నవంబర్ 15: పటీదార్ ఉద్యమనేత హార్దిక్ పటేల్ ఎన్డీఏ ప్రభుత్వం నగరాల పేర్లను మార్చడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేర్లు మార్చడమే సమస్యకు పరిష్కారం అనుకుంటే భారతీయుల పేర్లను రాముడు అని పెట్టాలన్నారు. యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అలహాబాద్, ఫైజాబాద్ పేర్లను మార్చడంపై పటీదార్ నేత స్పందించారు.
‘నగరాల పేర్లు మార్చితే భారతదేశం బాగుపడుతుందని అనుకుంటే.. మొత్తం 125 కోట్లమంది భారతీయులకు శ్రీరాముడి పేరు పెట్టాలి. ఓ వైపు రైతుల సమస్యలు, నిరుద్యోగంతో దేశం కొట్టుమిట్టాడుతోంది. వాళ్లు మాత్రం పేర్లు, విగ్రహాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు అని హార్దిక్ ఎద్దేవా చేశారు.అయోధ్యలో జరిగిన దీపోత్సవం కార్యక్రమం సందర్భంగా.. ఫైజాబాద్ జిల్లా పేరును అయోధ్యగా మార్చుతున్నట్లు యూపీ సీఎం ప్రకటించారు. అంతకుముందు అలహాబాద్ పేరును ప్రయాగ్ రాజ్గా పునర్నామకరణం చేశారు. అయితే ముజఫర్నగర్ పేరును లక్ష్మీనగర్గా, గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ ను కర్ణావతిగా మార్చాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.