పవన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్త్రీవాదులు

SMTV Desk 2018-11-14 17:35:37  Pawankalyan, Jaganmohan reddy, Congress, Janasena

తూ, గో, జి, నవంబర్ 14: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ నేత జగన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ జగన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘జగన్ ప్రశ్నించడమే మరిచారు. అసెంబ్లీకి వెళ్లకుండా నన్ను తప్పుబట్టడం కరెక్ట్ కాదు. ముందు ఆయన నన్ను వదిలేసి ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదియ్యాలి...అప్పుడు ఆయన మగతనం ఎంటో తెలుస్తుంది. నాకు వొక ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ లేరు. అయినా నేనొక్కడినే ప్రజా సమస్యలపై పోరాడుతుంటే.. అంతమంది ఎమ్మెల్యేలను ఉంచుకుని వైసీపీ నేతలు ఏం చేస్తున్నారు. బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటానని ప్రగల్భాలు పలికిన జగన్.. రెల్లి కులస్థుల భూములను ఆ పార్టీ నేతే దోచుకున్నా పట్టించుకోలేదు అని తీవ్రంగా విమర్శించారు పవన్.

అయితే పవన్ వ్యాఖ్యలపై స్త్రీవాదులు మండిపడుతున్నారు. అసెంబ్లీ అంటే సినిమా షూటింగులకు వెళ్లి హీరోయిన్లతో సరసాలు ఆడి మగతనం నిరూపించుకున్నట్టు అనుకుంటున్నారు పవన్ అని దుయ్యబట్టారు. ఇప్పటికే ముగ్గురు భార్యలను చేసుకుని తన మగతనమేంటో చూపించారు కదా అందుకే పవన్ అలా మాట్లాడుతున్నారని అన్నారు.

ఇదిలా వుండగా పవన్ తెలంగాణపై చేసిన వ్యాఖ్యలపై కూడా దూమారం రేగుతోంది. తెలంగాణలో ఇల్లు, భూమి, సంపాదన వుంది.. కానీ తెలంగాణ వాళ్లు ఆంధ్రావాళ్ళను అవమానిస్తున్నారని తాను ఆంధ్ర ప్రదేశ్‌కు వచ్చానని అన్నారు. దీంతో తెలంగాణ వాదులు ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. రాజకీయ నాయకులు అంటున్న మాటలను తెలంగాణ ప్రజలకు అంటగట్టకూడదని అంటున్నారు. తెలంగాణలో బతకడం కాదు ఇక్కడివాళ్లను ప్రేమించండి అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.