నిజామబాద్, నవంబర్ 5: ఆదివారం ఆర్మూర్ లో జరిగిన రజకుల ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్శింహారెడ్డి పాల్గొని సమావేశంలో మాట్లాడుతూ “రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బ తీసేందుకు పనిచేస్తున్న కాంగ్రెస్, టిడిపిలు మహాకూటమి రూపంలో మీ ముందుకు వస్తున్నాయి. వాటిలో వొక చిన్న గడ్డం (చంద్రబాబు నాయుడు) వొక పెద్ద గడ్డం (ఉత్తమ్ కుమార్ రెడ్డి) ఉన్నాయి. మన ప్రాజెక్టులను అడ్డుపడుతున్న వారినీ వారి పార్టీలను తిప్పికొట్టి వారి బారి నుంచి మన రాష్ట్రాన్ని కాపాడుకోవలసిన బాధ్యత ప్రజలదే. వొకప్పుడు ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడ్డాడు. తెలంగాణ ఏర్పడిన తరువాత మన ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నాడు.
మన రాష్ట్రాభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్న చంద్రబాబు నాయుడు, మహాకూటమి తరపున ఎన్నికల ప్రచారానికి వస్తానని చెపుతున్నారు. ఆయనకు మన రాష్ట్రంలో అడుగుపెట్టే హక్కేలేదు. తమపార్టీయే తెలంగాణను ఇచ్చిందని గొప్పలు చెప్పుకొంటున్న కాంగ్రెస్ నేతలు, తమ అధిష్టానం జాప్యం చేయడం వల్లే 1,200 మంది విద్యార్ధుల బలిదానాలు చేసుకొన్నారని వొప్పుకొంటే బాగుండేది. కాంగ్రెస్నేతలకు ఎంతసేపు పదవులు, అధికారం కోసం తాపత్రాయమే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర ప్రజల సమస్యల గురించి ఏమాత్రం ఆలోచన లేదు. అందుకే వారు రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతున్న చంద్రబాబు నాయుడుతో నిసిగ్గుగా చేతులు కలిపారు,” అని వివరించారు.