తిరుమల, అక్టోబర్ 31: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన కత్తి దాడిపై ఎమ్మెల్యే ఆర్కే రోజా స్పందిస్తూ ఈ దాడి తెలుగుదేశం కుట్రేనని ఆరోపించారు. తిరుమల శ్రీవారిని మంగళవారం ఉదయం రోజా దర్శించుకున్నారు. తరువాత ఆమె మీడియాతో మాట్లాడుతూ.. దాడికి పాల్పడిన శ్రీనివాస్ కోటి రూపాయలతో భూమి కొనుగోలు చేసేందుకు బేరసారాలు ఆడాడని తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించి టిడిపి నేతలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. టిడిపి నేతలు వెంటనే తమ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. హీరో శివాజీ పథకం ప్రకారమే అమెరికాకు పారిపోయాడని రోజా ఆరోపించారు.ముఖ్యమంత్రి, మంత్రుల తీరు చూస్తుంటే వెగటు వస్తోందని రోజా అన్నారు. ప్రజలకు రక్షణ కల్పించలేకపోతున్న నేతలు దాడికి గురైన వారిపైనే వెటకారంగా మాట్లాడటం సరికాదన్నారు. జగన్పై దాడి జరిగిన గంటలోనే నిందితుడు జగన్ అభిమాని అని డీజీపీ చెప్పడం, ఫ్లెక్సీని విడుదల చేయడం వెనుక కుట్ర ఉన్నట్లు తెలుస్తోందని రోజా అన్నారు.