మంచిర్యాల, అక్టోబర్ 30: ప్రముఖ జానపద గాయకుడు గద్దర్ ఈ మధ్య అతనికి మహాకూటమిలో అన్ని పార్టీలు తనకు మద్దతు ఇస్తే తాను గజ్వేల్ నుంచి సిఎం కేసీఆర్పై పోటీ చేయడానికి సిద్దంగా ఉన్నానని చెప్పారు. దానికి ఏ ప్రతిపక్ష పార్టీ స్పందించలేదు. అయితే తాజాగా ఈ మధ్యే కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన కుమారుడు సూర్య కిరణ్ మాత్రం మంచిర్యాల జిల్లాలో బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేయబోతున్నారట. నిన్న జరిగిన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో సూర్యకిరణ్ పేరును ఖరారు చేసినట్లు సమాచారం.
అయితే మహాకూటమిలో సీట్ల సర్దుబాట్లు పూర్తయిన తరువాత రెండవ జాబితాలో సూర్యకిరణ్ పేరు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వొకవేళ కాంగ్రెస్ పార్టీ సూర్యకిరణ్ కు బెల్లంపల్లి టికెట్ ఖరారు చేసినట్లయితే గద్దర్ ఇక గజ్వేల్ నుంచి పోటీ చేసే ఆలోచనను విరమించుకొని కొడుకుకు మద్దతుగా బెల్లంపల్లిలో జోరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనవచ్చని తెలుస్తోంది.